ఒక వ్యక్తి రెండు పడవల పై ప్రయాణం చేస్తే అది సక్సస్ కాదు అని అంటారు. కానీ ప్రస్తుతం పవన్ మూడు పడవల ప్రయాణం చేస్తున్నాడు. మొదట్లో పవన్ రాజకీయ పార్టీ పెడతాడు అని ప్రచారం జరిగినప్పుడు దాదాపు ఎవరు అంతగా నమ్మలేదు. పవన్ పార్టీని ప్రకటించడమే కాకుండా అందరికి భిన్నంగా వ్యవహరిస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా పవన్ భిన్నంగా వెళ్తున్నాడు. సామాన్యంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల అవగాహన లేదా మద్దతు ఎదో ఒక పార్టీకి తెలియచేస్తుంది. కానీ పవన్ మాత్రం ఒక పార్టీకి కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల కు మద్దతు పలుకుతూ దేశరాజకీయాలలో కొత్త రికార్డు సృష్టిస్తున్నాడు.. ఒక వైపు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి పవన్ పూర్తి మద్దతు అంటు తెలుగుదేశం వైపు కూడ సానుకూలంగా స్పందించాడు. ఎన్నికలలో జనసేన పోటీకి అభ్యర్ధులను నిలపదు అని చెప్పిన పవన్ గత రెండు రోజులుగా ఇస్తున్న ట్విస్ట్ లు రాజకీయ పార్టీలను ఖంగారు పెట్టిస్తున్నాయి. కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో తెలుగుదేశానికీ మద్దతు తెలుపుతూనే నిన్నటి నుంచి మరో డ్రామాకు తెరతీసాడు. నిన్న అర్దరాత్రి వరకు పవన్ ఇంటిలో జరిగిన మoతనాల నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు పార్లమెంట్ స్థానాలలో పవన్ తన జనసేన అభ్యర్ధులను నిలబెట్టడం ఖరార్ అయినట్లు వార్తలు వినపడుతున్నాయి. వీరంతా ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడుతూ ఎల్లుండి నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తూ ఉంటే పవన్ పొలిటికల్ త్రిపాతాభినయం చేస్తూ ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల మోడీకి మరి కొన్ని చోట్ల తెలుగుదేశానికి ఇంకా మిగిలిపోయిన స్థానాలలో తన ప్రియనేస్తం పొట్లూరి వర ప్రసాద్‌ తదితర వర్గం అభ్యర్ధులకు పవన్ ప్రచారం చేస్తూ భారత దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు చేయని సంచలనం చేస్తున్నాడు.  మరి ఈ పొలిటికల్ గేమ్ లో ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి.
 
Top