నెల తిరగ కుండానే టాలీవుడ్ ను మరో విషాదంలోకి నెట్టేసింది. ప్రముఖ తెలుగు నిర్మాత, దాదా పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్. దగ్గుబాటి రామానాయుడు కన్నుమూసారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది సేపటి క్రితం రామానాయుడు కన్ను మూశారు. తెలుగు సినిమా రంగానికి మకుటంలేని చక్రవర్తిగా నిర్మాతగా ఐదు దశాబ్దాలు కొనసాగిన ఈయన ప్రస్థానంలో ఎన్నో ఘన విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి.
కరన్సీ నోటు పై ముద్రించబడ్డ అన్ని భాషలలోను సినిమాలు తీసిన ఘనత రామానాయుడి సొంతం. ఈయన ఇప్పటి వరకు 13 బాషల్లో 150 వరకు చిత్రాలు నిర్మించారు, ఆరుగురిని హీరోలుగా, 21 మందిని దర్శకులుగా, 12 మందిన హీరోయిన్లుగా పరిచయం చేసారు. అంతేకాదు అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.
సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులైన దాదా సాహెబ్ ఫాల్కె, పద్మభూషణ్ తో సహా పలు అవార్డులతో సత్కరించింది. స్వయం కృషితో తెలుగు సినిమా రంగంలోనే కాదు భారతీయ సినిమా రంగంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగిన రామానాయుడు పేరు తెలియని వ్యక్తి సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయిని అదే రంగంలో పెట్టి ఎన్నో సంస్థలు స్థాపించడమే కాకుండా చేసిన ప్రతి వ్యాపారంలోను విజయాన్ని సాధించిన ఘనత ఆయన సొంతం. ఆయన మాత్రమే కాకుండా ఆయన పిల్లలు, మనవలు టాలీవుడ్ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న నేపధ్యంలో ఆయన కుటుంబంలోని అందరి హీరోలతో ఒక కుటుంబ సినిమాను తీద్దామనే కోరిక ఆయనకు తీరకుండానే ఆయన కన్ను మూయడం తెలుగు సినిమా రంగానికి మరో విషాదం..
 
Top